ఈస్ట్-వెస్ట్ కారిడార్లో భాగంగా మూసీనదికి ఇరువైపులా నాలుగులేన్ల రోడ్డు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పా రు. స్థలాల అందుబాటునుబట్టి హైదరాబాద్లో గజ్వేల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్లు, వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ (వీడీసీసీ) రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. పాతబస్తీలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి అధికారులతో సమీక్షించారు.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, పాదచారుల వంతెనలు, రోడ్ల విస్తరణ తదితర పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంచినీటి సరఫరా పైప్లైన్ల నిర్వహణ, క్రీడా మైదానాలు, మెట్రోలైను నిర్మాణం, నాలాల విస్తరణ, ఎస్సార్డీపీ ప్రాజెక్టులు తదితరవాటికి అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచేందుకు ఓ అధికారిని నియమించాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు. రోడ్ల విస్తరణ కోసం ఆస్తులిచ్చేందుకు ముందుకొచ్చేవారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి స్థలాలు స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. ఇందుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.